ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ మరో 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జస్టిస్ లీసాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. పంజాబ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు జస్టిస్ లీసాగిల్ . బీఏ ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎమ్ చేసి 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2014లో పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక కొలీజియం సిఫారసును ఆమోదిస్తూ కేంద్రం ఆమోదముద్ర లాంఛనమే కావడంతో జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టుకు ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగేది. అయితే సుప్రీం కోర్టు కొలీజియం ఈ విషయంలో కీలక మార్పు చేసింది. రాష్ట్రాల హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడానికి రెండు నెలల ముందుగానే తదుపరి సీజే ను సిఫారసు చేస్తూ వారి పేర్లు కేంద్రానికి పంపుతోంది. న్యాయపాలనలో ఎక్కడా ఎలాంటి అవాంతరం, జాప్యం, విరామం ఉండకూడదన్న లక్ష్యంతోనే సుప్రీంకోర్టు ఈ మార్పు చేసింది. మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos