గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ విచారణలో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంపై ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం అని నిర్ధారించారు. తన ఫోన్,తన భర్త ఫోన్, తన దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారని వెల్లడించారు. అలాగే తన ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. అనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షర్మిల తెలిపారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నానని, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని తెలిపారు. రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. గతంలో కేసీఆర్-జగన్ ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారని, వారిద్దరూ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే తన ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల ఆరోపించారు. అప్పట్లో తన ఇంటికి వచ్చి తన ట్యాపింగ్ ఆడియో స్వయంగా వినిపించిన సుబ్బారెడ్డి ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా అనేది అనుమానమేనని అన్నారు. గతంలో జగన్ తన పిల్లల ఆస్తులు కాజేసే విషయంలోనే సుబ్బారెడ్డితో అబద్దాలు చెప్పించారన్నారు. గతంలో ఉన్న పరిస్ధితుల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టలేకపోయానన్నారు.
తాను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారని,తన భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారని షర్మిల గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర చేశారన్నారు. తనకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారని, రాజకీయంగా తన వాళ్ళను రానివ్వకుండా చేశారన్నారు. తన అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. తాను ఊపిరి తీసుకోవడమే కష్టమనిపించేలా చేశారన్నారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదని, కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడన్నారు. తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడన్నారు. జగన్ ఉనికి కోసం తాను పోరాటం చేశానని, కానీ తన ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారని ఆరోపించారు. అయినా సరే..తనకు వ్యక్తిగత కక్షలు లేవని షర్మిల అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos