గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి పొద్దుపోయాక మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో విచారణ జరుగుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏ31, ఏ32 నిందితులుగా వీరిద్దరూ ఉన్నారు. వీరి అరెస్ట్‌లను వైఎస్సార్‌సీపీ ఖండించింది.

ఈ ఇద్దరు నిందితులపై ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ 
మూడు రోజుల పాటు విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం సిట్‌ అధికారులు వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో... ఆ గడువు ముగియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ ఏర్పాటుచేయగా.. విచారణ చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, నాటి సీఎం వైఎస్‌ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్‌ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను సిట్ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్పను సిట్‌ అధికారులు ఇప్పటికే  అరెస్ట్‌ చేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా... శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వారి పిటిషన్లను రద్దు చేసింది. పిటిషనర్‌లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. ఈ క్రమంలో సిట్ అధికారులు స్పందించి ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Related Videos