ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ 38)ని మంగళవారం రాత్రి సిట్ అరెస్ట్ చేసింది. చెవిరెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు(ఏ 34) సైతం అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి పై ఇదివరకే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరూ బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మైగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం వీరిని అడ్డుకున్నారు. ఏపీ పోలీసులకు సమాచారం అందించగా, బెంగళూరు వెళ్ళిన సిట్ బృందాలు మంగళవారం రాత్రి చెవిరెడ్డి తో పాటు వెంకటేష్ నాయుడును అరెస్ట్ చేశారు. దాంతో లిక్కర్ స్కామ్ కేసులు అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
వైసీపీ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి కలెక్ట్ చేసిన నగదును రాజ్ కసిరెడ్డి అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారని సమాచారం. చెవిరెడ్డి చెప్పడంతో ఆయన సిబ్బంది హైదరాబాదు, బెంగళూరులోని పలు ప్రాంతాలకు వెళ్లి ఆ సొమ్మును తీసుకొచ్చేవారని, ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు మొత్తం 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి చేతికి చేరాయని సిట్ భావిస్తోంది. చెవిరెడ్డికి చేరిన సొమ్మును ఐదు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని, ఆ నగదును వారు ఓటర్లకు పంపిణీ చేసి ప్రభావితం చేశారని సిట్ అనుమానిస్తోంది. ఆ నగదు వ్యవహారాన్ని తరలించడం, దాచడం చేసింది వెంకటేష్ నాయుడు అని సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.
ఈ కేసులో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ఏ 34, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ 38, చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఏ 39 సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చింది సిట్. ఈ మేరకు కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. ఏ 35 బాలాజీ యాదవ్ చెవిరెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో అతడు తుడాలో పనిచేశాడు. ఏ 36 నవీన్ రెడ్డి చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు. రాజ్ కసిరెడ్డి నుంచి సొమ్మును చెవిరెడ్డికి చేరవేయడంలో ఇతడు కిలకంగా వ్యవహరించాడు. ఏ 37 గా ఉన్న హరీష్.. చెవిరెడ్డి డ్రైవర్. నవీన్ తో పాటు వెళ్లి రాజ్ కసిరెడ్డి నుంచి నగదు తీసుకొచ్చాడని సిట్ అధికారులు తెలిపారు.
మరోవైపు చెవిరెడ్డి దగ్గర గన్మెన్గా పనిచేసిన AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ సహా పలువురికి లేఖ రాశారు. లిక్కర్ కేసులో తాము చెప్పిన వివరాలు రాసి సంతకం చేయాలని సిట్ అధికారులు తనను ఒత్తిడి చేశారని లేఖలో ఆరోపించారు. విచారణకు యూనిఫాంలో వెళ్తే తనను తిట్టారని, లిక్కర్ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉందని చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. తాను అందుకు అంగీకరించకపోవడంతో తనపై సిట్ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. మదన్ రెడ్డి లేఖ, వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. విచారణలో తమకు సహకరించకపోవడంతో పాటు మీ పేర్లు రాసి చనిపోతానని సిట్ అధికారులనే మదన్ రెడ్డి బెదిరించాడని తెలిపారు. మొత్తం మీద ఈ వ్యవహారాలన్నీ తేలాలంటే పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సిందేనని సర్వత్రా భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos