ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై సీబీఐ చేపట్టనుంది. వివరాల్లోకి వెళితే... 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలి ప్రీతి మృతికి సంబంధించి కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ కేసును సీబీఐకి అప్పగించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని ఆయన గతంలో పలు సందర్భాల్లో భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నపుడు పవన్ కల్యాణ్ ఈ కేసుపై పోరాటం చేసి.. సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37ను విడుదల చేసింది. అయితే, తర్వాతి కాలంలో కేసు ఎలాంటి పురోగతి సాధించలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు మరుగున పడిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ హామీని నెరవేరుస్తూ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేయడం గమనార్హం. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అందజేయనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos