ఏపీలో జనసేన పార్టీ తిరుపతి ఇన్ చార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ లైంగిక వేధింపుల వ్యవహారం ఓవైపు కలకలం రేపుతుండగానే.. ఇవాళ ఆయన బాధితురాలిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నుంచీ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో ఆమెను పోలీసులు చివరికి అరెస్టు చేసి తీసుకెళ్లడం మరింత సంచలనంగా మారింది. అంతకు ముందే తిరుపతిలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ పై ఆరోపణలు గుప్పించారు. కిరణ్ రాయల్ మాటలకు మోసపోయానని, తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. రాయల్ నుంచి తనకు , తన పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. తన వెనక జనసేన పార్టీ ఉందని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వీరమహిళలు ఉన్నారన్నదే అతని ధైర్యమని అన్నారు. అతన్ని నమ్మడం తాను చేసిన తప్పని, ఆర్థిక లావాదేవీలు లేవని 2016లోనే తెగిపోయాయని చెబుతున్న కిరణ్, తనకు 2023లో ఎందుకు చెక్కులు ఇచ్చాడని అడిగారు. తనతో పాటు గతంలో ఎంతోమందిని మోసం చేసాడన్నారు. తన చావు తర్వాత అయినా తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.
తన వెనక ఏ పార్టీ లేదని, తనకు న్యాయం చేయాలని ఆర్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన డబ్బులు తనకు కావాలని కోరారు. అవసరం తీరిపోతూనే వారిపై అభియోగాలు వేస్తాడని కిరణ్ రాయల్ ను విమర్శించారు. తాను కిలాడి లేడీ అయితే, పండుగలకు, పుట్టిన రోజులకు వారి పిల్లలు ఎందుకు తమ ఇంటికి వచ్చారని నిలదీశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను విడుదల చేస్తే కిరణ్ ప్రాణాలతో ఉండడన్నారు. అతని సన్నిహితులు కానీ,అతను కానీ కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే,డబ్బులు వదిలేస్తానన్నారు. ఒంటరి మహిళను అని కొట్టడమే కాకుండా,మోసం చేసాడని ఆమె తిరుపతిలో ప్రెస్ మీట్ లో గోడు వెళ్ళబోసుకున్నారు. కాగా ఈ ప్రెస్ మీట్ ముగియగానే ఆమెను జైపూర్ పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చి అరెస్టు చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసు అని కూడా చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మరోవైపు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఆదేశించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos