ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండటంతో.. గత రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు ఉండనుండగా.. రాజధాని ప్రాంతంలో యదాతథా ధరలే అందుబాటులో ఉండనున్నాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే వర్తిస్తాయి. ఇదిలాఉండగా ధరలు పెరగకముందే తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కొన్నిచోట్ల సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ల చేపట్టారు అధికారులు. గడచిన రెండు రోజుల్లో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. ఒక్కరోజులోనే ప్రభుత్వానికి రూ. 107 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.
శుక్రవారం కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మామూలుగా అయితే ప్రతి రోజు సగటున 7 వేల నుంచి 8 వేల వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీని వల్ల రూ.25-30 కోట్ల వరకు ఆదాయం వస్తుంటుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా అల్లూరి జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగని పరిస్థితి ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం అవుతుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos