అమరావతి బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి, తరుణీ తరంగాలు ప్రధాన కార్యదర్శి, సేఫ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) అధ్యక్షులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి అయిన 55 ఏళ్ల గుళ్ళపల్లి జ్యోత్స్న రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
ఆమెకు ఇద్దరు కుమారులు ఆషీష్, అనీష్ ఉన్నారు. పెద్ద కుమారుడు ఉద్యోగం రీత్యా లండన్ లో, చిన్న కుమారుడు విజయవాడలో ఉంటున్నారు. జోత్స్న భౌతికకాయాన్ని విజయవాడలో ఈ రోజు ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు సీతారాంపురం సన్ రైజ్ హాస్పిటల్ పక్క వీధిలోని వారి స్వగృహం వద్ద ఉంచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
జ్యోత్స్న మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్ధినులను చైతన్య పరిచేందుకు జ్యోత్స్న అనేక కార్యక్రమాలు నిర్వహించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై రాజస్థాన్ సిఎం భజన్లాల్ శర్మతో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన రాష్ట్రానికి చెందిన న్యాయవాదుల బృందంలోని వారికి అవసరమైన వైద్య సహాయంతోపాటు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
జ్యోత్స్న మృతి పట్ల సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సంఘంలో విజయవాడ నగరంలో అనేక సంతవ్సరాలకుపైగా పనిచేశారని, సారా వ్యతిరేక ఉద్యమం, మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా మహిళలను సమీకరించడంలో కృషి చేశారని తెలిపారు. మహిళా న్యాయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలకు న్యాయపరమైన సహకారం అందించారని,తరుణీతరంగాల ద్వారా మహిళా ఫెస్ట్ నిర్వహణలో, సేఫ్ సంస్థ ఏర్పాటు చేసి లింగ సమానత్వం కోసం అనేక కాలేజీల్లో విద్యార్థినులను చైతన్యం చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. జ్యోత్స్న మృతి తీరనిలోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జ్యోత్స్న చిన్నప్పటి నుంచీ వామపక్ష భావాలతో పెరిగారు. ఆ భావాల వ్యాప్తికి, మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారు. నిరంతరం మహిళా సమస్యలపై, సామాజిక అంశాలపై పోరాడారు. 1980లో స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థినుల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ గా పనిచేశారు. బస్సు ప్రమాద వార్త తెలిసిన వెంటనే సీపీఎం, టీడీపీ, వైసీపీ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఐద్వా, సీఐటీయూ, ఐలు, తదితర ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు, విజయవాడ బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు న్యాయవాదులు విజయవాడలోని గుళ్లపల్లి జోత్స్న ఇంటికి చేరుకొని ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
జోత్స్న మృతి మహిళా, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని ఐద్వా జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి పేర్కొన్నారు. ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జ్యోత్స్స మృతి పట్ల ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి సంతాపాన్ని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos