ఏపీలో వచ్చే ఏడాదితో స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు, ఎస్ఈసీ సంసిద్ధత, ఈవీఎంల వాడకం వంటి అంశాలపై కమిషనర్ నీలం సాహ్నీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిపై ఇవాళ ఆమె ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని నాలుగు దశల్లో నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వమే ఈవీఎంలను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. గ్రామ పంచాయతీలలో 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయన్నారు. ఒక కంట్రోల్ యూనిట్కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయవచ్చన్నారు. సంవత్సరం క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని నీలం సాహ్నీ తెలిపారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కమిటీకి ఛైర్మన్గా ఉన్నారని గుర్తుచేశారు. జనవరి నుంచి ఎన్నికలపై ఒక ఆలోచనకు రావాలని సూచనాత్మకంగా లేఖ రాసినట్లు తెలిపారు. ఇవాళ ఈవీఎంల గురించి మాత్రమే చర్చించామన్నారు. ఆన్లైన్ నామినేషన్లు ఇచ్చినా, ఫిజికల్గా ఇవ్వాల్సిందేనని ఎస్ఈసీ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. జనవరి నుంచి స్థానిక ఎన్నికల సంసిద్ధత తెలియజేయాలని కోరినట్లు ఎలక్షన్ కమీషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించి స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించాలా లేక బ్యాలెట్ పేపర్లు వాడాలా అన్న దానిపైనా ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయాన్ని ఈసీకి తెలియజేయనుంది. అనంతరం ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos