ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడిందని, ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరంవైపు చేరే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు, రేపు అంటే శుక్ర, శనివారాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ సమయంలో సముద్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఫెంగల్ తుపాను కారణంగా పలు జిల్లాలలో పంట నష్టం కూడా సంభవించింది. రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. తిరుమల కొండపైన ఉన్న ఐదు రిజర్వాయర్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos