రాయచోటి జిల్లా కేంద్రం మార్పు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం ప్రజల సెంటిమెంట్కు అద్దం పడుతోంది. అయితే, ప్రభుత్వం కేవలం రాజకీయ లాభనష్టాలే కాకుండా, లోతైన పరిపాలనాపరమైన చిక్కులను విశ్లేషించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మదనపల్లె భౌగోళికంగా, జనాభా పరంగా , వాణిజ్య పరంగా రాయచోటి కంటే పెద్ద నగరం. బ్రిటీష్ కాలం నుండే ఇక్కడ విద్యా, వైద్య రంగాలు బలంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసినప్పుడే మదనపల్లె వాసులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మదనపల్లెను జిల్లాగా మారుస్తూనే, రాయచోటిని అందులో విలీనం చేయడం ద్వారా పశ్చిమ చిత్తూరు ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం తీర్చినట్లయింది. ఇది పెద్ద ఓటు బ్యాంక్ కలిగిన మదనపల్లెలో ప్రభుత్వానికి రాజకీయంగా బలమైన పట్టును ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో గతంలో ఉన్న వింతైన భౌగోళిక పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వం భావించింది. గత విభజనలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల ప్రజలకు కలెక్టరేట్ కార్యాలయం 100 కిలోమీటర్ల కంటే దూరంగా ఉండేది. ఇప్పుడు మదనపల్లెను కేంద్రంగా చేయడం ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, మంత్రిని ఓదారుస్తూనే సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తప్పడం లేదని సీఎం కుండబద్దలు కొట్టినట్లు వివరించారు.
జిల్లా కేంద్రం హోదా పోతే ఆ ప్రాంతం వెనుకబడుతుందనే ఆందోళన మంత్రికి, అక్కడి ప్రజలకు ఉంది. దీనిని గమనించిన సీఎం, కేవలం జిల్లా కేంద్రం అనే పేరు మాత్రమే మారుతుందని, రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని హామీ ఇచ్చారు. రాయచోటికి మెడికల్ కాలేజీ కేటాయింపు , మౌలిక సదుపాయాల మెరుగుదల ద్వారా అక్కడి ప్రజల ఆగ్రహాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ. జిల్లా కేంద్రం పోతే రాజీనామా చేస్తా అని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పడేశాయి. తన సొంత నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించలేననే బాధతోనే ఆయన కేబినెట్లో ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇవ్వడంతో, ఇప్పుడు ఆయన ఆ అభివృద్ధి పనుల ద్వారా ప్రజలను సమాధానపరచాల్సిన బాధ్యత ఉంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ కంటే పరిపాలనా సమర్థత, సుదీర్ఘ ప్రయోజనాలకే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రం మార్పు అనేది ఒక ప్రాంతానికి నిరాశ కలిగించినా, మొత్తం జిల్లా అభివృద్ధికి ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోందని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos