ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. మంతెన సత్యనారాయణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవాళ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకృతి వైద్యుడిగా మంతెన సత్యనారాయణరాజుకు మంచి పేరుంది. అలాగే ఉండవల్లిలో కరకట్ట వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు మంతెన సత్యనారాయణరాజు సేవలు అందిస్తున్నారు.
ప్రకృతి వైద్యంలో మంతెన సత్యనారాయణరాజుకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగానే ఏపీ ప్రకృతి వైద్య సలహాదారుడిగా ఆయనను నియమించింది. మంతెన సత్యనారాయణరాజుకు విజయవాడతో పాటు మరో రెండు చోట్ల కూడా ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. ప్రజారోగ్యాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల్లో ప్రకృతి వైద్యానికి ప్రత్యేక స్థానం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నియామకం చేసినట్లు సమాచారం. ఆధునిక వైద్యం తో పాటు ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను సమన్వయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో, మాస్ కమ్యూనికేషన్ రంగంలో అనుభవం ఉన్న పోచంపల్లి శ్రీధర్ రావును కూడా ఏపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. సమాచార ప్రసారం, ప్రజలతో ప్రభుత్వ కార్యక్రమాల అనుసంధానం వంటి అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనున్నారు. పోచంపల్లి శ్రీధర్ రావు అంటే ఎవరో కాదు... ప్రముఖ కార్టూనిస్ట్ గా ఆయన పేరుప్రఖ్యాతులు అందుకున్నారు. ఈనాడు దినపత్రికకు సుదీర్ఘకాలం సేవలు అందించారు. మంతెన సత్యనారాయణ రాజు, పోచంపల్లి శ్రీధర్ రావు ఇద్దరూ రెండేళ్ల పాటు ఈ సలహాదారు పదవుల్లో కొనసాగనున్నారు. ప్రజారోగ్యం, సమాచార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకాలు దోహదపడతాయని భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos