ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 10న అంటే రేపు గురువారం మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మీటింగ్కు హాజరవుతారు. ఈ సమావేశంలోసమస్యలుంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాల గురించి చర్చిస్తారు. ఈ సమావేశం సందర్భంగా మొక్కలు నాటడం, ఆటల పోటీలు, భోజనాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డును కూడా అందజేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశం గురువారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. తల్లిదండ్రులను, ముఖ్య అతిథులను స్కూళ్లకు పిలుస్తారు. స్కూళ్లలో ఓపెన్ హౌస్ ఫొటో బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫొటోలు దిగుతారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి తరగతి గదుల్లో కూర్చుంటారు.. ముఖ్య అతిథులు హెచ్ఎం గదిలో ఉంటారు. క్లాస్ టీచర్లు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడతారు. పిల్లల ప్రోగ్రెస్, హెల్త్ కార్డులు ఇస్తారు. ఈ సమావేశంలో తల్లికి వందనం పథకం, పాజిటివ్ పేరెంట్ మీటింగ్, మనబడి మేగజైన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివాటి గురించి వివరిస్తారు. ఉదయం 11 గంటలకు విద్యార్థులు తమ తల్లులకు పుష్పాలు అందజేసి, కాళ్లకు నమస్కారం చేస్తారు. అనంతరం తల్లి పేరుతో మొక్కను నాటుతారు.
అంతేకాదు ఈ కార్యక్రమంలో నో టు డ్రగ్స్, సైబర్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో స్కూల్ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, విద్యా కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు కలిసి స్కూళ్లలోనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం ముగుస్తుంది. ఈ మెగా సమావేశంలో ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు (సమగ్ర ప్రగతి పత్రం) కూడా ఇస్తారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీగా ఈ కార్డులు ఇస్తున్నారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థి వివరాలు, మార్కులు, హాజరు, నైపుణ్యాలు వంటివి ఉంటాయి. ఈ ఏడాది తల్లిదండ్రుల అభిప్రాయానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించడాన్ని ప్రజలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos