ఏపీ మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున ఐదారు రోజులు మధ్యలో పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన 80 శాతం మందికి మొదటి ఐచ్చికంగా నమోదు చేసుకున్న పరీక్ష కేంద్రాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. దరఖాస్తుల సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి 8 వరకు ప్రాధాన్యత క్రమంలో ఐచ్చికాలు స్వీకరించారు.
వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. హాల్ టికెట్లను శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. . https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో సులభంగా వీటిని పొందే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్దమొత్తంలో దరఖాస్తు చేశారు.
ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఈసారి మహిళలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఎస్సీ పోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి.
జూన్ 6 నుంచి ప్రారంభమై…. జులై 6వ తేదీ వరకు జరగబోయే ఈ పరీక్షలను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో…. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos