నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని మంత్రికి అందించారు. ఈ సమీక్ష సమావేశంలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే ఖాట్మండూ చేరుకుంది. ఖాట్మండూ నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గం.లకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటుంది, అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులను స్వాగతించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న తరువాత బాధితులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని ఆయన ఆదేశించారు. వీలైనంత త్వరగా ఏపీ వాసులు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ ఆదేశించగా... ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos