ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఎంతోమంది ప్రజలు వారి సమస్యల్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. మంత్రి లోకేష్ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టీమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ .. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన నెటిజన్ సమస్యపై మంత్రి లోకేష్ స్పందించడమే కాకుండా .. తన సొంత డబ్బులతో భవనాలు నిర్మిస్తానని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.
'కడప జిల్లా శ్రీ కాశినాయన మండలం కేంద్రం అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన పరమపదించిన దివ్యస్థలం. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అధికారులు ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చి ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని కొన్ని భవనాలను కూల్చి వేశారు. ఈ సమస్య మీ దృష్టికి రాలేదని అనుకుంటున్నాను . ఈ సమస్య నాలుగు జిల్లాల ప్రజల మనోభావాలకు సంబంధించినది అన్న.. దయచేసి మీరే ఈ సమస్యను పరిష్కరిస్తారని మీ దృష్టికి తీసుకువస్తున్న అన్న' అంటూ ఓ నెటిజన్ నారా లోకేష్ను రిక్వెస్ట్ చేశారు.
వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. 'అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను' అంటూ భరోసా ఇచ్చారు.
అలాగే మంగళగిరి వాసులకు మంత్రి నారా లోకేష్ తీపికబురు చెప్పారు. ఎకో పార్కులో ఉదయం నడకకు వచ్చే వాకర్లకు ఇక ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 'మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా, మాట ఇచ్చాను. ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు. వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధులనుంచి చెల్లించాను. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6నుంచి 9గంటల వరకు ఎకోపార్కులో నడక సాగించవచ్చని తెలియజేస్తున్నాను' అంటూ ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos