పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఏడాది ఉగాది తర్వాత జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది . ఈ క్రమంలో అక్కడ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇదే సమయంలో కేంద్రానికి పోలవరం విషయంలో పలు విజ్ఞాపనలు కూడా చేస్తోంది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలసిన మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్రప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితుల కోసం సహాయ,పునరావాస పనులు వేగవంతం చేశామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతులు వచ్చేలా సహకరించాలని మంత్రి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువలు 17,500 క్యూసెక్కులకు పెంచిన సామర్ధ్యాల రియంబర్స్ మెంట్ కు సహకరించాలన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలు వినియోగించుకునేలా, పోలవరం - నల్లమలసాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక - ఆర్దిక అనుమతులు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
ఏటా సగటున 3వేల టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలసిపోతున్నదని వివరించిన మంత్రి నిమ్మల,తుఫానులు, ఆటుపోట్లు వంటి సముద్రపు కోత, నదుల కోతకు గురవుతున్న ప్రాంతాలకు రక్షణకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదుల ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలని కోరారు. డెల్టా డ్రైన్స్ తో పాటు, సముద్రంలో కలిసే చోట, ముఖద్వారాల వద్ద పూడిక తీయడం, వెడల్పు చేయడానికి నిధులు సాయం అందించాలని మంత్రి నిమ్మల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos