విజయవాడ: మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టంలేకే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టి, రాజ్యాంగ సవరణకు ప్రయత్నించిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మోడీ సర్కార్‌ కుట్రను ముందే పసిగట్టిన ప్రతిపక్షాలు రాజ్యాంగ సవరణను అడ్డుకొని దేశభక్తిని చాటుకున్నాయని స్పష్టంచేశారు.  సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వికె) ఆధ్వర్యంలో ‘మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ బిల్లు వంచనలు-వాస్తవాలు’ అంశంపై జరిగిన సెమినార్ లో మాట్లాడుతూ.. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే సంబంధంలేని అంశాలతో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించి, పార్లమెంటులో అది వీగిపోయాక, ఆ ఓటమిని భరించలేక ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై శాపనార్థాలకు దిగుతూ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఐక్యంగా రాజ్యాంగ సవరణను తిరస్కరించాయనీ, అదే సమయంలో మహిళా రిజర్వేషన్లకు పూర్తి అనుకూలమని స్పష్టంగా ప్రకటించాయని గుర్తుచేశారు. 
మోడీ ప్రభుత్వం ఈ బిల్లు ముసుగులో రాజకీయ దుర్భుద్ధిని ప్రదర్శిస్తూ, తనకు అనుకూలంగా డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) చేసుకోవాలనే కుట్రలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయాయన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్‌కు ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందో ప్రధాని మోడీ సభకు వివరణ ఇవ్వకుండా కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. జాతినుద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం భాషను కూడా అదుపులో ఉంచుకోకుండా ప్రతిపక్షాలను ఉద్దేశించి భ్రూణ హత్య, మహా పాపం అనే పదాలతో విషపూరిత ఉపన్యాసం చేశారని అభ్యంతరం వ్యక్తంచేశారు. 
ముఖ్యమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అన్ని రాజకీయపార్టీలతో సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేయడం ఆనవాయితీ అనీ, అలాంటిదేం లేకుండా చివరి నిముషం వరకు సభలో ఏం పెడుతున్నారో కూడా తెలుపకుండా అంత రహస్యంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ఎందుకు తేలేదో తొలుత స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదంటూ ప్రధాని మోడీ మొదలు ఆర్‌ఎస్‌ఎస్‌ వరకు విమర్శలు చేస్తున్నారనీ, అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు, డీ లిమిటేషన్‌ను ఎందుకు లింక్‌ పెట్టాల్సి వచ్చిందో స్పష్టంచేయాలన్నారు. 
2010లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందనీ, అప్పుడు ఇదే బిజెపి మహిళా రిజర్వేషన్లకు, డీ లిమిటేషన్‌ను ప్రస్తావించలేదన్నారు. జనగణనను 2027కు వాయిదా వేసి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, డీ లిమిటేషన్‌ను 2011 జనగణనతో చేపడతామని ప్రకటించడం కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యమేనని స్పష్టంచేశారు. దేశంలో ఓవర్గం జనాభా పెరగుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన చేస్తూ, మరోవైపు అదే జనాభా నిష్పత్తి ప్రకారం డీ లిమిటేషన్‌ చేస్తామనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. డీ లిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, విస్త్రుత చర్చలు జరపాలనీ, కొత్త జనగణన లెక్కలకు అనుకూలంగా మహిళా రిజర్వేషన్లను సవరించుకోవచ్చని సూచించారు. తప్పుడు మార్గంలో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టినందరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related Videos