అమరావతి దశ దిశ తిరిగిపోయే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మరో రూ.8 వేల కోట్ల విలువైన ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాజధాని అమరావతిలో రూ.49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అమరావతి రాజధాని నేలపాడులో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూ. 856 కోట్ల రూపాయల వ్యయంతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించబోతున్నారు. మొత్తం 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాల బ్యాలెన్స్ పనులను 452 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో రూ. 419 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1 విధానంలో మొత్తం 71 బంగ్లాల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తారు. అమరావతిలో రూ.617 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారు. బేస్మెంట్+గ్రౌండ్+3 ఫ్లోర్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. రాజధానిలో తాత్కాలిక హైకోర్టు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ప్రపంచస్థాయి ఐకానిక్ హైకోర్టు భవనాన్ని 786 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు నివాస, కమర్షియల్ రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ జోన్లలో దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎల్పీఎస్ ఇన్ర్ఫా పనులు చేపడుతోంది. వీటికి మోదీ శంకుస్థాపన చేశారు.
సచివాలయం కోసం జీ ప్లస్ 40 విధానంలో 4,668 కోట్ల రూపాయల వ్యయంతో ఐకానిక్ సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో చేపడుతున్నారు. రాజధానిలో వరద సమస్యను శాశ్వతంగా నివారించటానికి వీలుగా 5,944 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీలలో పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రాజధానిలో రోడ్లు, కేబుల్స్ రహిత డక్ట్స్, సైకిల్ ట్రాక్స్కు సంబంధించిన పునరుద్ధరణ పనులను 9,150 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. వీటన్నింటికీ మోదీ శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా రూ.1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్డీవో చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్లతో విశాఖలో డీపీఐఐటీ చేపట్టే యూనిటీ మాల్కు, రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్-మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, రూ.3,176 కోట్లతో ఎన్హెచ్ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభించారు. రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos