టాలీవుడ్ అగ్ర నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది. రెండ్రోజుల కిందట మొదలైన ఈ వివాదం .. మంగళవారం నాటికి తారా స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జల్పల్లి వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్బాబుతో పాటు బౌన్సర్లు, సహాయకులు దాడికి పాల్పడ్డారు. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు.
మోహన్ బాబు స్వయంగా ఓ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని అతడిపై దాడి చేయడం, బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడటం వంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనను పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీడియా హక్కులకు భంగం కలిగేలా దాడులు చేయటం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం స్పందించి ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయటాన్ని తాను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కుటుంబ కలహాలు మీడియా ముందుకు రాకూడదని, మీడియా ప్రతినిధులు తమ వృత్తిపరమైన విధులు తాము చేస్తున్న నేపథ్యంలో వారిపై శారీరకంగా దాడులు చేయటం ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదన్నారు. మోహన్ బాబు అలా చేయటం సరైంది కాదని రఘునందన్ రావు ట్వీట్ చేశారు.
కాగా మీడియా ప్రతినిధులపై దాడి వ్యవహారంలో మోహన్బాబుపై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నారు. గత రాత్రి జరిగిన తోపులాటలో ఆయనకు గాయాలు అయినందున చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. విచారణకు రావాల్సిందిగా మోహన్ బాబుతో పాటు, కుమారులు, మనోజ్, విష్ణులకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos