ఏపీలో పలు జిల్లాల్లో చిరుత పులి కదలికలు పెరుగుతున్నాయి. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చిరుత కదలికలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చిరుత పులి కదలికలు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాంతంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. పాతాళగంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ నివశిస్తున్నారు. ఆయన ఇంటి ఆవరణలోకి అర్థరాత్రి వేళ చిరుత ప్రవేశించింది. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
పాతాళగంగ వద్ద ఉన్న పూజారి ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించిందన్న విషయం తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చిరుత కదలికల నేపథ్యంలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. చిరుత ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా, కృష్ణా జిల్లాల్లోనూ చిరుతలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం చిరుత పులి కదలికలు కనిపించాయి. మెట్లపల్లిలోని ఆయిల్ పామ్ తోట వద్ద ఆర్టీసీ కండక్టర్కు చిరుత పులి కనిపించింది. చిరుత పులి తన పిల్లలతో కలిసి రోడ్డు దాటడాన్ని కండక్టర్ గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. కండక్టర్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మరోవైపు చిరుత సంచారం వార్తల నేపథ్యంలో మెట్లపల్లి, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. పొలం పనులకు, పక్క గ్రామాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.
అటు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోనూ చిరుత పులి సంచారం స్థానికులను భయపెడుతోంది. ఓ రైతు పొలంలోని ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేశామని.. అయినా కూడా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos