ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు కానీ... అప్పుడే పొలిటికల్ రచ్చ స్టార్ట్ అయింది. ఓ వైపు దొంగఓట్లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుహక్కు వివాదం కూడా దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంలో జనసేన నేత నాగబాబుపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు... ఏపీలో కూడా ఓటు కోసం ఎలా దరఖాస్తు చేసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. దీంతో వైసీపీ ఆరోపణలపై నాగబాబు స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతో తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని... దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందినవారు కావాలనే దీన్ని వివాదం చేస్తున్నారన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాజకీయాలకు సంబంధించిన ఓ కామెడీ మ్యాగజైన్ వార్త రాసిందని సైటైర్లు వేస్తూ... తన భార్యాపిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నామని అన్నారు. మంగళగిరిలో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓట్లు రాకుండా బూత్ స్థాయిలోనూ వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. కాగా... షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీకి రానున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్ల పై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్కు సైతం ఇరుపార్టీలు ఫిర్యాదు చేశాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారనేది ఏపీలో ప్రధాన పార్టీల ఆరోపణ. దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఓటర్ల జాబితాపై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ నెల 26 వ తేదీ వరకూ ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది. ఆ తర్వాత జనవరి ఐదో తేదీన ఫైనల్ జాబితాను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. ఒకవైపు ఈ ప్రక్రియ జరుగుతుండగానే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్నికల హడావుడి ప్రారంభయింది. మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందుగానే రావచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఇప్పటికే రాజకీయంగా వాతావరణం హీటెక్కింది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్లుగా 20 రోజుల ముందే షెడ్యూల్ వస్తే... ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి మూడోవారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో షెడ్యూల్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రతినిధుల బృందం నుంచి ఏవైనా సంకేతాలు వస్తాయా అనే ఉత్కంఠ కూడా మొదలైంది. మొత్తానికి ఈసీ పర్యటనతో ఎన్నికల ప్రక్రియకు మొదటి అడుగు పడనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos