వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లను కింది కోర్టులు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వంలో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్యకు గురైంది. అయితే అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ తమను మోసం చేశారని మరియమ్మ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పెన్షన్ ఆపేశారని, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపణలు చేసింది. దీంతో నందిగం సురేశ్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను కొట్టి చంపేశారు. ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని, కేసును పక్కన పెట్టారని మరియమ్మ కుమారుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో నందిగం సురేశ్ తో పాటు 34 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఆ తర్వాత నందిగం సురేశ్ కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రయల్ కోర్టు ఇతర కారణాలతో తనకు బెయిల్ ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేశారు. మాజీ ఎంపీ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు చెబుతూ.. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని గుర్తుచేసింది. దీంతో ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము కల్పించుకోబోమని పేర్కొంటూ మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. నందిగం సురేష్ కు ఈ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయనకు చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos