ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టుల నిర్మాణంపై దృష్టిసారించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఆధారిత పరిశ్రమలు ఉండేలా మొత్తం 20 పోర్టులను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే పోర్టు ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, 2026 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాదిలోనే 4 పోర్టులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఈ పోర్టులను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానించడమే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశాల్లో డ్రైపోర్టులను ఏర్పాటు చేసి పోర్టు సేవలను విస్తరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది.
రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రస్తుతం 69 శాతం పూర్తయింది. 2025 జూన్ నాటికి ఈ పోర్టును ప్రజల వినియోగానికి తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, భారీ నౌకల రాకపోకలకు వీలుగా డ్రెడ్జింగ్ను 16 మీటర్ల నుండి 18.5 మీటర్లకు పెంచాలన్న నిర్మాణ సంస్థ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, పనుల గడువు మరింత పొడిగించే అవకాశం ఉంది. ఈ పోర్టును ఉమ్మడి ప్రకాశం జిల్లా చేవూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారి-16తో అనుసంధానం చేయనున్నారు. అలానే మచిలీపట్నం పోర్టు పనులు 45.5 శాతం పూర్తి కాగా, 2026 నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఉంది. మొదటి దశలో నాలుగు బెర్తులు నిర్మించనుండగా, భవిష్యత్తులో ఇవి 16 వరకూ విస్తరించవచ్చు. ఈ పోర్టు ఏడాదికి 36 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సరుకు మచిలీపట్నానికి తరలించే ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.638 కోట్ల వ్యయంతో బీచ్రోడ్డును ఆరు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసి, జాతీయ రహదారి-65తో అనుసంధించే ప్రతిపాదన పంపగా కేంద్రం వద్ద పరిశీలనలో ఉంది.
మరోవైపు కాకినాడ గేట్వే పోర్టు పనులు ప్రస్తుతం 31 శాతం పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్స్ నిర్మాణం 83.45 శాతం, డ్రెడ్జింగ్ పనులు 16.35 శాతం, బెర్తుల పనులు 5.6 శాతం పూర్తయ్యాయి. వాకపూడి లైట్ హౌస్ నుండి అన్నవరం వరకు రహదారి అభివృద్ధి ద్వారా జాతీయ రహదారి-16తో అనుసంధించే ప్రతిపాదన ఉంది. ఈ పోర్టు వాణిజ్య అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. అదేవిధంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు 54.01 శాతం పూర్తయ్యాయి. 2026 మే నాటికి ఈ పోర్టును పూర్తిగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోర్టు ద్వారా ప్రతి సంవత్సరం 25-30 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యం ఉంటుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో డ్రైపోర్టులు ఏర్పాటు చేసి మూలపేట పోర్టుతో అనుసంధించాలనే ప్రణాళికపై కార్యాచరణ ప్రారంభమైంది. టెక్కలి జంక్షన్ వద్ద జాతీయ రహదారి-16తో ఈ పోర్టును అనుసంధించనున్నారు. మరోవైపు హావ్డా- చెన్నై రైలు మార్గంతోనూ కలపాలని నిర్ణయించారు. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక కోర్టు నిర్మాణం జరిపి.. డ్రై పోర్టులతో ఇతర రాష్ట్రాలకు సేవలు విస్తరించాలనే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos