జయకేతనం పేరిట పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సమావేశంలో పవన్ కల్యాణ్ చాలా విషయాలపై స్పందించారు. ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇస్తూనే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలు పంపారు. రేపటి భవిష్యత్లో తెలంగాణ, తమిళనాడులో పోటీ ఖాయమనేలా పవన్ ప్రసంగం సాగింది. తెలంగాణలోకి ఎంట్రీ అవ్వడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించేలా గత ఏడాది ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు తన ఫోకస్ లోకల్బాడీ ఎన్నికలపై పెట్టింది. ఈ టైంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఆసక్తిి కలిగిస్తోంది. జనసేనాని తన ప్రసంగాన్ని తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య చెప్పిన పంక్తులతో ప్రారంభించారు. ‘‘రుద్రవీణ వాయిస్తా....అగ్నిధార కురిపిస్తా... తిరుగుబాటు జెండా ఎగురేస్తా... దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’’ అనేదే జనసేనకు బలమని చెప్పుకొచ్చారు. జనసేన పుట్టింది తెలంగాణలోనేనని గుర్తు చేశారు. గద్దర్ గురించి ప్రస్తావించారు. గతంలో ఎంఐఎం చేసిన కామెంట్స్ను తప్పుపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడిని సభపైకి పిలిచి సన్మానం చేశారు.
తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని జనసేనాని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం టైంలో విద్యత్ షాక్ తగిలితే కొండగట్టు ఆంజనేయస్వామి దయతో బతికానంటూ గుర్తు చేశారు. చాలా అంశాల్లో తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీ విస్తరణ ఖాయమేనంటూ సంకేతాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన ఫార్ములా తెలంగాణలో కూడా కూటమి అనుసరించనుందని ఎప్పటి నుంచో పుకార్లు వస్తున్నాయి. టీడీపీ సైలెంట్గా నాయకులను సిద్ధం చేస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీ ఎలాగో తెలంగాణలో స్ట్రాంగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు జనసేన కూడా సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మరికొన్ని రోజుల్లో ఏపీలో విజయం సాధించినట్లుగానే .. తెలంగాణలో కూడా కూటమి విజయం చూడబోతున్నామనే వాదన బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికే తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవి చిన్న ఎన్నికలే అయినా పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో మరికొన్ని నెలల్లో పొలిటికల్ హీట్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా కూటమి రాకను ముందే గ్రహించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు అందుకున్నాయి. ఆంధ్రా పాలకులు మళ్లీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారని, వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ఆ పార్టీలు సెంటిమెంట్ను రాజేస్తున్నాయి. ఈ మధ్య పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ చంద్రబాబుపై ఇలాంటి విమర్శలే చేశారు. రెండు రోజుల క్రితం కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos