జల్జీవన్ మిషన్ కోసం రూ.70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో జల్జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పవన్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్రం నుంచి రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకూ ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై పవన్ ఆరా తీశారు. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో విలువైన పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదు. విడుదలైన నిధులను కూడా సద్వినియోగం చేశారా అనే విషయంపైనా పవన్ కల్యాణ్ వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని, ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనల్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నదీ లేనిది పరిశీలన చేయాలని పవన్ ఆదేశించారు.
ఈ పథకం కింద కేంద్రం భారీగానే నిధులు విడుదల చేసిన గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చాలా నష్టం జరిగింది. గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో ఏపీ దేశంలోనే చాలా వెనుకబడి పోయింది.
ఇదిలా ఉంచితే... ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవహారాలు, సాంకేతిక అంశాల నుంచి అంతిమంగా ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకోసం జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి కనిపించాలన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని ఈ ఏడాది ఆ జాబితాలో రాష్ట్రం కూడా ఉండాలని పవన్ కల్యాణ్ అధికారులను నిర్దేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos