ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులతో పాటు రాష్ట్రంలోని కీలక స్ధానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఇందులో పాల్గొంటున్నారు. రేపు ఎస్పీలు కూడా ఈ సదస్సుల్లో పాల్గొనబోతున్నారు. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకాలేదు. పవన్ కళ్యాణ్ ఇవాళ్టి కలెక్టర్ల సదస్సుకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ల సదస్సులో పలువురు అధికారులు దీనిపై చర్చించుకోవడం కనిపించింది. అయితే ఇవాళ కలెక్టర్ల సదస్సుకు రాకపోవడంపై సీఎం చంద్రబాబుకు ముందుగానే పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ లేకుండానే సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు రాకపోవడంపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. మహాలయ పక్షాలను అనుసరించి పితృ కర్మ పూజలు ఉండటం మూలంగా పవన్ కల్యాణ్ ఈ రోజు కలెక్టర్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపింది. పితృ కర్మ పూజ ప్రక్రియ ఈ రోజునే ప్రారంభమైందని వెల్లడించింది. ఆ పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొనాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండవ రోజున అంటే రేపు పాల్గొంటారని ప్రకటించింది. ఈ సదస్సులో భాగంగా రేపు ఎస్పీలు, కలెక్టర్లు కూడా సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొంటున్న తాజా పరిణామాలు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై రేపు పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న అటవీశాఖలో అధికారులపై దాడులు జరిగినా తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వయంగా జనసేన స్ధానిక నేత, టీడీపీ ఎమ్మెల్యే దాడిలో పాల్గొనడంతో ఈ ఘటనను పవన్ లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ రేపు దీనిపై స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos