ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా కారణంగా పది మంది చనిపోయారు. దీంతో ఈ గ్రామంలో పర్యటించేందుకు వచ్చారు పవన్. అతిసారంతో బాధపడుతున్న వారిని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో అతిసారం అంశం మీద సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం ఓ దివ్యాంగురాలు తెలుసుకుని... తన కష్టాన్ని డిప్యూటీ సీఎం వద్ద మొరపెట్టుకోవాలని నిర్ణయించుకుంది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ను కలిసే పరిస్థితి లేదు.
దీంతో రోడ్డుపైనే పవన్ కళ్యాణ్ కోసం నిరీక్షించి..పవన్ కాన్వాయి కలెక్టర్ ఆఫీసు నుంచి వెళ్తున్న సమయంలో రోడ్డు మీదకు వచ్చింది. సారూ.. నా గోడు వినoడంటూ మొరపెట్టుకోగా... అదే సమయంలో కారులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ దివ్యాంగురాలని గమనించారు. వెంటనే కారును ఆపి.. కిందకు దిగి రోడ్డు మీద కూర్చుని ఆమె సమస్యను విన్నారు. తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పక్కనున్న మరికొందరు దివ్యాంగులు కూడా తమ సమస్యలపై పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందించారు. వీటన్నింటినీ స్వీకరించిన పవన్.. చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ దృశ్యాలను పక్కనున్న వారు వీడియో తీయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos