ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. "ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి" అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) 'ఎక్స్'లో వెల్లడించింది.
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలువురు ఏపీ మంత్రులు విచారం వ్యక్తం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. అనంతరం ఆమె హుటాహుటిన విజయవాడ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ తదితరులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos