విశాఖపట్నంవాసులకు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నగర పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూ ఇయర్ పేరు చెప్పి ఎవరైనా గీత దాటితే కేసులు తప్పవని హెచ్చరించారు. స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే పబ్బులు, క్లబ్బులు, హోటల్స్ తప్పనిసరిగా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అనుమతి తీసుకున్నవారు ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్-2013 నిబంధనను కచ్చితంగా పాటించాలన్నారు. ఈ నిబంధన ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంటకు వేడుకలు నిలిపివేయాలన్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించేవారు కచ్చితంగా ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన వాహనాలు, డ్రైవర్లను నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేశారు. ఈ వేడుకలు నిర్వహించే ప్రాంతంలో లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి వేర్వేరుగా మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు.. దీని కోసం సెక్యూరిటీ గార్డుల్ని నియమించుకోవాలన్నారు. ఒకవేళ దంపతుల కోసం న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహిస్తే.. అక్కడికి మైనర్లను అనుమతించొద్దని.. అలా అనుమతించడం నేరమని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ వరకు, జీవీఎంసీ అండర్పాస్ రోడ్డు, మద్దిలపాలెం టూ రామాటాకీస్, హనుమంతవాక టూ ఎన్ఏడీ జంక్షన్ బీఆర్టీఎస్ రోడ్లను మూసివేస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే.. రెండు వైపులా ఉండే సర్వీస్ రోడ్డులో వెళ్లొచ్చని చెప్పారు.
డిసెంబర్ 31న ఆకతాయిలకు చెక్ పెడతామని.. నగరంలో అవసరమైన చోట్ల షీటీమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయని.. తాగి వాహనం నడిపితే ఆ వాహనం సీజ్ చేయడంతో పాటుగా కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందన్నారు. నగరవాసులు ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నగర పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos