ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలతో రెచ్చిపోయిన టాలీవుడ్ నటి, వైసీపీ కార్యకర్త శ్రీరెడ్డికి కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై రాష్ట్రంలోని పలు చోట్ల నమోదైన కేసులో చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఆమెను ఇవాళ విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషన్ కు పిలిపించారు. వైసీపీ ప్రభుత్వంలో పవన్, లోకేష్ సహా కూటమి నాయకులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న టీడీపీ,జనసేన నాయకులు ఆమెపై పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె భయపడటమే కాకుండా... తనను వదిలేయాలని బతిమాలుతూ లోకేష్, పవన్, చంద్రబాబుకు పోస్టులు పెట్టారు. దీంతో శ్రీరెడ్డిని పోలీసులు ఏ కేసులోనూ ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. అలాగే పోలీసులు ఇతర చర్యలు కూడా తీసుకోలేదు. అయినా ఆమె భయంతో హైకోర్టును ఆశ్రయించగా ..కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం, మిగతా కేసుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఈ కేసుల్లో ఒకటైన నెల్లిమర్లలోని పూసపాటిరేగ పోలీసు స్టేషన్ లో విచారణకు శ్రీరెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. దీంతో శ్రీరెడ్డిని స్టేషన్ సిఐ రామకృష్ణ విచారించారు. అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరోసారి విచారణకు ఆమెను పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై పెట్టిన అనుచిత పోస్టులపై నమోదైన కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును శ్రీరెడ్డి ఆశ్రయించగా... ఫిబ్రవరి 24న విచారణ జరిపిన హైకోర్టు...విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం ఊరటనిచ్చింది. కానీ చిత్తూరు వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. అలాగే కర్నూలు టూటౌన్, గుడివాడ వన్టౌన్, విజయనగరం జిల్లా నెలిమర్లలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో శ్రీరెడ్డికి పోలీసులు, కేసుల బాధ తప్పలేదనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos