ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు, నేతలు క్షేత్రస్ధాయిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను తిరిగి అధికారంలోకి రాగానే పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టబోననే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ లో మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఆ ఉత్సాహం కాస్త ఇప్పుడు మరింత పెరిగి వైఎస్ జగన్ పర్యటనల్లో రప్పా.. రప్పా అంటూ పోస్టర్లు పెట్టేవరకూ వెళ్లింది. ఇటీవల జగన్ తెలంగాణ టూర్ లోనూ ఇవి కనిపించాయి.
వైఎస్ జగన్ 2029లో అధికారంలోకి రాగానే రప్పా.. రప్పా నరుకుతాం అంటూ వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు తాజాగా రాష్ట్రంలో పలు చోట్ల పోస్టర్లు పెట్టడం మొదలుపెట్టారు. గతంలో జగన్ పల్నాడు టూర్ లో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తరిస్తోంది. దీంతో స్థానికంగా తమను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ నేతల్ని వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రప్పా రప్పా నరుకుతామనే అర్ధం వచ్చేలా పలువురు పోస్టర్టు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఇలాంటిదే రప్పా.. రప్పా ఫ్లెక్సీని స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ విషయంలో పోలీసులు రంగంలోకి దిగారు. 2029 ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో "వేటతలలు నరికినట్లు రప్పా, రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని" అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై కేసు నమోదు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆరుగురితో పాటు ప్రింట్ చేసిన రాయల్ ఫ్లెక్సీ దుకాణంపైన కేసు పెట్టడమే కాకుండా. షాపు సీజ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos