వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులకు సాంఘిక బహిష్కరణ విధించారన్న వార్తల నేపథ్యంలో శ్యామల స్పందించారు. PPP... పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ మీ ఇలాకా పిఠాపురంలో దళితుల దుస్థితి ఇది... సిగ్గుపడాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్ తో మరణించాడు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకు మొత్తం దళితులను మల్లాం గ్రామస్తులు వెలివేశారు. వారిని పొలం పనులకు పిలవడం లేదు... వారికి పాలు కూడా పోయడం లేదు... దీంతో దళిత కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇదేనా మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం ప్రజలకు న్యాయం చేయడం?" అంటూ శ్యామల ధ్వజమెత్తారు.
మరోవైపు దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయటం తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి వారి పై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఐడీఆర్ఎఫ్ సఫాయి కర్మచారి లేబర్ ఏపీ స్టేట్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎం.ఎల్ నారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఇంకా దళితుల పట్ల చిన్న చూపు కుల బహిష్కరణలు వంటివి జరగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితుల బహిష్కరణ జరగడం దానికి ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ షెడ్యూల్ కులముల కమిషన్ జోక్యం చేసుకొని దళితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దళితుల పట్ల కుల వివక్షతతో వ్యవహరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎంఎల్ నారాయణ కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos