రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉన్నతాధికారులను నేతలు పరస్పరం పరిచయం చేసుకున్నారు. కాగా ఉక్రెయిన్లో 'శాంతియుత పరిష్కారం' కోసం రష్యా కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన వివరాలను భారత్తో పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఢిల్లీలో ఇవాళ శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. సైనిక ఘర్షణ కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఈ పర్యటనను నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నా, భారత్ తన వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. అమెరికా కూడా తమ దేశం నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని పుతిన్ గుర్తుచేశారు. "వారు మా నుంచి ఇంధనం కొనగలిగినప్పుడు, భారత్ ఎందుకు కొనకూడదని?" ఆయన ప్రశ్నించారు.
ఈ పర్యటనలో భాగంగా రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడుకోవడం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల రంగంలో సహకారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం భారత్కు చేరుకున్న పుతిన్కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం పలికిన విషయం తెలిసిందే. పుతిన్ తన ప్రత్యేక సాయుధ కారు 'ఆరస్ సెనెట్'ను కాదని, ప్రధాని మోదీ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos