ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విశాఖలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా.. సభా ప్రాంగణంలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, మంత్రి లోకేష్తో ఆసక్తికర సంభాషణ జరిగింది. మోదీ వేదికపైకి వెళ్లే ముందు గ్రీన్ రూంలో.. మంత్రులు ఆహ్వానించే క్రమంలో లోకేష్తో మాట్లాడారు. ప్రధానికి మంత్రులందరూ నమస్కరిస్తుండగా.. ప్రధాని ప్రతి నమస్కారం చేశారు. ఈ క్రమంలో లోకేష్ దగ్గరకు వెళ్లి మోదీ ఆగినప్పుడు.. లోకేష్ నమస్కారం చేశారు.
లోకేష్ నమస్కరించగానే 'నీ మీద ఒక ఫిర్యాదు ఉంది' అంటూ మోదీ అనడంతో లోకేష్ కాస్త కంగారుపడ్డారు.. కానీ అది చమత్కారం. 'అదేంటో మీకూ తెలుసు కదా?' అంటూ ఆ పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు చూశారు. ఆ తర్వాత... ‘ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది... ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు.. కుటుంబంతో వచ్చి నన్ను కలువు’ అంటూ ప్రధాని మంత్రి లోకేష్ భుజం తట్టారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. 'త్వరలోనే వచ్చి కలుస్తా సార్' అన్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం తర్వాత అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గ్లోబల్ లీడర్గా ఉంటారని అన్నారు. 'మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేమని, నిరంతర పాలన ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి నిరూపించిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, ఇక్కడ కూటమి ధృడంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుందని, డబుల్ ఇంజన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్ అని, రెండు ప్రభుత్వాలు ఒక్కటిగా ఉంటే రెండంకెల వృద్ధి సాధ్యమని అన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రూ.2,08,548 కోట్ల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos