రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలోనూ, చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలోనూ పెద్ద సంఖ్యలో అమాయక ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున - మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి కావడం అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఈరోజు మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా లారీని ఢీకొనడంతో, బస్సు ఎడమవైపు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులను మరో వాహనంలో వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతుండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos