మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పొదిలి పర్యటనకు వచ్చారు. జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్బంగా జగన్కు నిరసన సెగ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లూ, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్.. మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురు దాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్ళు, చెప్పులు విసిరారు. దీంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్కు గాయం అయింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, ఈ ఘటన పైన మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేదని లేదని హెచ్చరించారు.
పొగాకు రైతులతో మాట్లాడిన జగన్... రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఏడాది కూటమి పాలనలో రైతులు సర్వస్వం కోల్పోయారని, ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టటం లేదని మండిపడ్డారు. వైసీపీ హయాం రైతులకు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. అన్నిరకాల రైతులకు తాము అండగా నిలిచామని గుర్తు చేసారు. పొగాకు పంట వేసుకోమని చెప్పి ..ఇప్పుడు ముంచారని జగన్ విమర్శించారు. పొగాకు వేలంలో మార్క్ ఫెడ్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం కావటం రైతులకు శాపంగా మారిందన్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ 6 వేలు కాకుండా రూ 20 వేలు సాయం ఇస్తామని చెప్పారని జగన్ పేర్కొన్నారు. గత ఏడాది రైతు భరోసా రూ 20 వేలు ఎగ్గొట్టారని ఆరోపించారు. మోదీ రూ 6 వేలు ఇవ్వగా చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి వచ్చాక దళారీలు లేకుండా పంట కొనే పరిస్థితి లేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఈ క్రాప్ వ్యవస్థను నీరు కార్చిందని జగన్ మండిపడ్డారు. ఇన్ పుట్ సబ్సిడీని గాలికి వదిలేసారని.. కల్తీ ఎరువులు.. విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. గతంలో రూ 366 గా ఉన్న కిలో పొగాకు పంటకు ఇప్పుడు రూ 240 కూడా దక్కటం లేదన్నారు. హైగ్రేడ్ పొగాకు పంటకు కూడా ధర దక్కటం లేదని చెప్పుకొచ్చారు. తమ హయాంలో మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించటంతో పోటీ పెరిగిందని గుర్తు చేసారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదని జగన్ నిలదీసారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసారు. లేకుంటే తామే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని జగన్ హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos