పీఎస్సార్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. రిమాండ్ లో ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఏపీపీఎస్సీ కేసు విచారణ చేస్తున్నారు. అయినా..పీఎస్సార్ లో దర్పం తగ్గలేదు. విచారణ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేయటం సంచలనంగా మారుతోంది. కస్టడీలో పోలీసు అధికారులపై ఒక ఐపీఎస్ తరహాలో వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జెత్వానీ కేసులో హైకోర్టు పీఎస్సార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో పోలీసు కస్టడీలో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహార శైలి పైన మరోసారి చర్చ సాగుతోంది. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పీఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ వీరిద్దరినీ వేర్వేరుగా విచారణ చేసారు. తొలిరోజు విచారణలో భాగంగా మధ్యలో టాయిలెట్ కు వెళ్లి వచ్చిన పీఎస్సార్ నేరుగా ఏడీసీపీ చాంబర్కు వెళ్లారు. ఆ చాంబర్లో ఇద్దరు ఏసీపీలు కూర్చు న్నారు. ఆయనను చూడగానే ఇద్దరు ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.
దీంతో, తనను చూసి నిలబడిన మరో ఏసీపీని పీఎస్సార్ ప్రశ్నలు వేశారు. తాను ఎదుర్కొంటున్న ఏపీపీఎస్సీ కేసును మీరే దర్యాప్తు చేస్తున్నారా.. మీరు ఎక్కడి ఏసీపీ అంటూ ప్రశ్నలు సంధించారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఇక్కడెందుకున్నారన్న అర్థం వచ్చేలా పీఎస్ఆర్ మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. తాను అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్లిపోయారు. పీఎస్సార్ ఏడీ సీపీ చాంబర్లోకి వెళ్లి ఏసీపీని ప్రశ్నించడం పైన చర్చ జరుగుతోంది.
ముంబయి సినీ నటిపై వేధింపులకు పాల్పడిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జెత్వానీపై తప్పుడు కేసు పెట్టించి, అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ2గా ఉన్నారు. పీఎస్ఆర్ను సీఐడీ పోలీసులు గత నెలలో అరెస్టు చేసి విచారణ జరిపారు. బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి సవివర ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos