ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం స్కామ్ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నాని పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ A1 గా ఉండగా.. నాని ఏ6గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు.
పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉన్న గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. బందరు తాలుకా పోలీస్స్టేషన్లో ఈ బియ్యం మిస్సింగ్ కేసు నమోదైంది. పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టి, 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు, అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాగా పేర్ని జయసుధ పేరున ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయమైన ఘటన కృష్ణా జిల్లాలో రాజకీయంగా చర్చకు కారణమైంది. ఉద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదైందని అప్పట్లో పేర్ని నాని ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర తోసిపుచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos