వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సంచలన విషయాలు బయటపెట్టిన సాయిరెడ్డి.. ఇప్పుడు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు. ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సలహా ఇచ్చారు. పాకిస్తాన్ పీచమణచాలంటే కేంద్రం ఏం చేయాలో సాయిరెడ్డి చెప్పేశారు. భారత్ లో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు.. దావూద్ ఇబ్రహీం ఎక్కడ నివసిస్తున్నాడు.. మసూద్ అజార్ ఎక్కడ దాక్కున్నాడంటే .. వీటన్నిటికీ ఒకే సమాధానం పాకిస్తాన్ అని సాయిరెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఎగుమతిదారు పాకిస్తాన్ అని అన్నారు. దీనికి విరుగుడుగా భారత్ ఏం చేయాలో సాయిరెడ్డి సలహా ఇచ్చారు. భారతదేశం పష్టున్ మరియు బలూచ్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు. అలాగే పాకిస్తాన్ నుండి పుట్టిన కొత్త దేశాలతో 1971ని పునరావృతం చేయాలంటూ కేంద్రానికి సూచించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై 1971 తరహాలోనే మరోసారి యుద్దం చేయాలంటూ దేశంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కూడా అదే డిమాండ్ వినిపించారు.
1971లో పాకిస్తాన్ పై వీరోచితంగా యుద్దం చేసిన భారత సేనలు.. ఆ దేశంలోని తూర్పు భాగాన్ని వేరు చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్నే కొత్త మిత్రులైన పష్టున్ (పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉన్న గిరిజనులు), బలోచ్ (పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు)తో కలిసి రిపీట్ చేయాలని సాయిరెడ్డి కోరుతున్నారు. సాయిరెడ్డి డిమాండ్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos