ఏపీలోని గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ముంబై నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(22159), పుదుచ్చేరి-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్ కేబుల్ కత్తిరించారు. దీంతో లోకోపైలట్ రైలును ఆపారు. రైలు ఆగడంతో ఐదుగురు దుండగులు రైలులోని ఎస్ 2 కోచ్ లోకి చొరబడ్డారు. అక్కడ ప్రయాణికులు కేకలు పెట్టడంతో దుండగులు ఎస్ 1 కోచ్లోకి వెళ్లి పయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితులు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అదేవిధంగా గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో కర్నూలు జిల్లా రామలింగాయపల్లి - పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి పుదుచ్చేరి - కాచిగూడ (17654) ఎక్స్ప్రెస్ రామలింగాయపల్లి - పెండేకల్లు రైల్వేస్టేషన్ మధ్యలో క్రాసింగ్ కోసం ఆగింది. రైలులోకి దుండగులు చొరబడి ప్రయాణికల నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళారు. బాధితులు డోన్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీ చోటు చేసుకోవడంతో రైల్వే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైల్వే రక్షణ దళం, జీఆర్పీ అధికారులు, పోలీసుల వైఫల్యాలతోనే దోపిడీలు జరుగుతున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. దోపిడీలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos