ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల్లో ఉంటూ చనిపోయిన అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా విధుల్లో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు ఇచ్చే రూ.15000 కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తూ సర్వీస్ కాలంలో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.15000 మంజూరు చేస్తూ వస్తున్నారు. ఈ పథకాన్ని పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చెందిన వారసులకు ఈ మొత్తాన్ని అందించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
మరోవైపు పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాలలో కార్యకర్తలను ప్రభుత్వం నియమిస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ, పోషణ చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంతో పాటుగా రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం, ఆటపాటలు, ప్రీప్రైమరీ విద్యను బోధిస్తున్నారు. ఆ రకంగా మాతా శిశుసంరక్షణలో అంగన్ వాడీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వీసులో చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు తగిన రీతిలో గౌరవించుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 55 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్య, పోషకాహార సేవలు అందిస్తున్నారు. అయితే అంగన్ వాడీ కార్యకర్తలను పలు సమస్యలు వేధిస్తున్నాయి. తమ సమస్యలపై అంగన్వాడీలు ఇప్పటికే పలు దఫాలుగా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్లోనూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేశారు. అయితే వారి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఏపీ ప్రభుత్వం..
చెప్తోంది. ఈ క్రమంలోనే అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ కూడా చెల్లించే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు అప్పట్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos