ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ నుంచి ఆయన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది.. కొత్త సీఎస్ సాయిప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలో సైతం కీలక పదవులు నిర్వహించారు. 1991 బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ 'ఎంటెక్' చదివారు. స్వస్థలం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మట్టిగుంట గ్రామం. సివిల్ సర్వీసు లో కి ప్రవేశించి 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1993-95 మధ్య పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా గిరిజన ప్రాంతాల్లో సేవలందించారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా... 1997-98 మధ్య కాలంలో కడప జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు కలెక్టర్గా పని చేసిన ఆయన.. 2024 జూన్ నుంచి జలవనరల శాఖ కార్యదర్శిగా, 2025 జనవరి నుంచి సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.
సాయి ప్రసాద్ విద్యుత్ రంగం, గృహనిర్మాణ రంగాల్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండీ, ఈపీడీసీఎల్ సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ, ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా సేవలందించారు. 2011 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. సాయిప్రసాద్ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా.. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ అమలు చేస్తున్న క్రమంలో అటు ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవటం.. ఇటు పాలనా యంత్రాంగాన్ని ముందుండి నడిపంచటం సాయి ప్రసాద్ కు బిగ్ టాస్క్ గా మారనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos