ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు పలువురు విచారణలు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు అయ్యారు. సెజ్లో కర్నాటి వెంకటేశ్వరరావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవీ రావు ఫిర్యాదును పరిశీలించిన ఈడీ.. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాల పైన నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ నోటీసులు ఇచ్చినా.. తాను పార్లమెంట్ సమావేశాలకు వెళుతున్నందున, విచారణకు హాజరు కాలేనని సాయిరెడ్డి లేఖ రాసారు. దీంతో, తిరిగి ఈ రోజు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ రోజు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. సాయిరెడ్డి తో పాటుగా ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్చంద్రా రెడ్డిలకి సైతం ఈడీ నోటీసులు పంపించింది. కాగా, తన ఆరోగ్యం బాలేదంటూ విక్రాంత్రెడ్డి ఈడీకి సమాచారం ఇచ్చి విచారణకు హాజరు కాలేదు. కాకినాడ సీపోర్టు లో తన వాటాలను విజయసాయిరెడ్డి బెదిరించి లాక్కున్నారని కేవీరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఈడీ వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని అదేశించింది.
కాకినాడ పోర్ట్ లోని రూ.2,500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్లోని రూ.1,109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఆరోపణల పైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీంతో, సాయిరెడ్డి తో పాటుగా ఇతర నేతలను విచారించిన తరువాత ... ఈడీ ఈ కేసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos