ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సంక్షేమ పథకాలు.. ఎన్నికల హామీల అమలు పైనా సుదీర్ఘంగా చర్చించారు. పథకాల అమలు కోసం క్యాలెండర్ ఖరారు పైన ఒక అంచనాకు వచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం పైన మంత్రులకు చంద్రబాబు కీలక సూచ నలు చేసారు. ఇక, మధ్యాహ్న భోజనం లో మార్పులకు నిర్ణయించారు. మద్యం వ్యాపారుల మార్జిన్ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ విద్యార్ధికి అమలయ్యేలా తల్లుల ఖాతాల్లో రూ 15 వేల జమ దిశగా పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అన్నదాత సుఖీభవ గా అమలు చేయనున్న రైతు భరోసా పై మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతుల పథకం అమలు కోసం విధి విధానాల ఖరారు పైన మంత్రులు ఫోకస్ చేయాలని నిర్దేశించారు. ఏప్రిల్ నుంచి మత్స్యకార పథకం అమలు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతల్లో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలనేది తాజా ప్రతిపాదన. ఇక, మధ్నాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగిస్తున్నట్లు మంత్రి లోకేష్ కేబినెట్ భేటీలో వెల్లడించారు. ప్రాంతాల వారీగా అక్కడి రుచులకు అనుగుణంగా విద్యార్ధులకు మధ్నాహ్న భోజన పథకంలో మెనూ అమలు చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 21 అంశాల పై చర్చించి.. నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ భేటీలో.. మద్యం వ్యాపారులకు మార్జిన్ ను 10.5 నుంచి 14 శాతంకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ లో తయారైన విదేశీ మద్యం , బీర్, ఎఫ్ ఎల్ స్పిరిట్ ల పై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణను ఆమోదించారు.
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీ ఎస్సి ఎస్టీ, మైనారిటీ లకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ లో డాక్యుమెం ట్ ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టే ప్రతిపాదన పై కేబినెట్ చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు మరింత బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు. మూడు నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos