అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి రైతుల సమస్యల పైన సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. వారికి పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మరో విడత భూ సమీకరణ తప్పదని, రైతులు సహకరించాలని కోరారు. దీంతో.. ప్రభుత్వం రెండో విడత కింద 44,676 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు కసరత్తు చేస్తుంది. గ్రామాల వారీగా ఎంత సమీకరించాలో లక్ష్యాలు నిర్ణయించింది. తాజాగా సీఎం చంద్రబాబు రైతులకు ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు అన్నారు. అదే జరిగితే ఓ మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందని, అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. కాగా తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని గ్రామాల్లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరగనుంది. తూళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లోని 9919 ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నారు. అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల గ్రామాల్లోని 12,838 ఎకరాల్లో భూ సమీకరణ జరిగే అవకాశం ఉంది. అలానే తాడికొండలోని తాడికొండ, కంతేరు గ్రామాలలోని 16,463 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించేలా సీఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేసింది. మంగళగిరిలోని కాజా గ్రామంలో 4492 ఎకరాలను భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాజధానిలోని 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించారు. ఇక.. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనున్నారు. ఈ భూముల్లో అమరావతికి ఎయిర్ పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం నుండి అమరావతి వరకు కొత్తగా వేయనున్న రైల్వే లైన్ కోసం వినియోగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎంతో జరిగిన సమావేశం సమయంలో రైతులు ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆంగీకారం తెలిపారు. దీంతో.. రెండ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం కానుందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos