ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో వరుసగా ఐటీ పార్కులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకుంది. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ వంటి కంపెనీలు శాశ్వత క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాటికి తాజాగా షాక్ లు తగులుతున్నాయి. దీంతో ఇదంతా జగన్ కుట్రేనని ఐటీ మంత్రి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. విశాఖలో ఐటీ పార్కుల ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ వంటి సంస్దలపై కోర్టుల్లో వరుసగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. దీంతో ఆయా సంస్థలకు ప్రభుత్వ భూకేటాయింపులతో పాటు ఇతర అంశాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్న వారి తరఫున వైసీపీ లాయర్లు వాదిస్తుండటంతో ఈ వ్యవహారంపై ఐటీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తాజాగా విశాఖపట్నంలోని టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా గ్రూప్, రహేజా కార్ప్ వంటి కంపెనీలు ఐటీ పార్క్ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో వాటిపై వైఎస్సార్సీపీ ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ యువతకు లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని లోకేష్ వెల్లడించారు. మన యువత భవిష్యత్తు పట్ల ఈ ద్వేషం ఎందుకు.. అడుగడుగునా ఏపీని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నారా లోకేష్ ట్వీట్ లో ప్రశ్నించారు. విశాఖపట్నంలో రహేజా కార్ప్ ప్రతిపాదిత ఐటీ పార్క్ కోసం భూమి కేటాయింపునకు వ్యతిరేకంగా 'సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్'కి చెందిన పిటిషనర్ జి.శ్రీనివాసరావు తరపున వైసీపీ సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై స్పందిస్తూ లోకేష్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
టాప్ పెట్టుబడులకు వ్యతిరేకంగా వరుసగా దాఖలవుతున్న పిల్లు పెట్టుబడిదారులకు ప్రతికూల సంకేతాలను పంపాయని , సాంకేతికత, ఆవిష్కరణ, ఉపాధికి గమ్యస్థానంగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరిచాయని లోకేష్ ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వం పారదర్శకమైన, చట్టబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉందని , జీవనోపాధిని, ఆర్థిక వృద్ధిని సృష్టించే ప్రాజెక్టులను కాపాడుతుందని ఆయన అన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునర్నిర్మించడం, ప్రపంచ కంపెనీలను ఆకర్షించడం మరియు యువతకు అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించినప్పుడు రాష్ట్రం రాజకీయ ప్రేరేపిత అడ్డంకులను భరించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉద్యోగాలు, నైపుణ్యాలు , వృద్ధిలో ఉందని, అలాంటి ప్రాజెక్టులను ఆపడానికి చేసే ప్రయత్నం యువత ఆకాంక్షలపై దాడి చేయడమేనని మంత్రి నారా లోకేష్ అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos