ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చెల్లి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మపై జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేసిన జగన్.. అదే సమయంలో తన సాక్షి మీడియా ద్వారా ప్రసారం చేస్తున్న కథనాలు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ దివంగత వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.
రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదని, వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారని, ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదని షర్మిల తెలిపారు.. ఈ రోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదన్నారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే అన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని అన్నారు. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాననేది హాస్యాస్పదమని అన్నారు.
తనకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదని, వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదని షర్మిల తెలిపారు. కేవలం తన బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలనేది రాజశేఖర్ రెడ్డి అభిమతం గనుక,ఈ రోజు వరకు కూడా అమ్మైనా, తానైనా అందుకోసమే తపన పడుతున్నామన్నారు. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుందని, వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుందని షర్మిల తెలిపారు. అయినా తన బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.
తనకు 200 కోట్లు ఇచ్చామని జగన్ చెబుతున్నారని కంపెనీల్లోని డివిడెండ్ లో సగం వాటా తనకు ఇవ్వడమే ఈ 200 కోట్లు అన్నారు. వాళ్ళు చేసింది ఉపకారం కాదన్నారు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదని, తనకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగిందన్నారు. అది కూడా అప్పుగా చూపించమన్నారని అన్నారు.
మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి కండీషన్ పెట్టారని షర్మిల తెలిపారు. తాను జగన్ మీద, భారతి రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశమని అన్నారు. ఆ కండిషన్ తన వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి తనకు సమ్మతం అనిపించలేదన్నారు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా తాను ఒప్పుకోలేదన్నారు. తాను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదన్నారు.
అమ్మ, తాను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, వైఎస్సార్ అభిమానులు భావించకూడదని.. వాస్తవాలు అన్ని మీ ముందు పెడుతున్నట్లు షర్మిల తెలిపారు. ఎంఓయూ తన చేతుల్లో ఐదేళ్లు ఉన్నా...దాంట్లో తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, తనకు తానుగా కానీ బయటపెట్టలేదన్నారు. అవకాశం, అవసరం ఉన్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం, వైఎస్ పరువు కోసం ఎక్కడా ఐదేళ్లలో ఎంఓయూ బయట పెట్టలేదన్నారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఎంవోయీ బయటకు వచ్చిందన్నా... పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసంటూ షర్మిల ముగించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos