తిరుమల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో శారదా పీఠం నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణం చేయటంతో.. 15 రోజుల్లో ఖాళీ చేసి మఠాన్ని అప్పగించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు తాజాగా మఠం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసారు. దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఆరోపిస్తోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తొలుత ప్రకటించినా.. భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియో గించుకోవాలని ఇప్పుడు భావిస్తోంది. తొలుత ఈ అంశం పైన మఠం నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అటువంటి భవనాల నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. ఇటు, విశాఖ శారదాపీఠం నిర్మించిన భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. విశాఖలో కేటాయించిన భూముల రద్దుతో పాటు తాజా నిర్ణయంతో శారదాపీఠానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా టీటీడీ 15 రోజుల డెడ్ లైన్ తో నోటీసుల జారీ చేయటంతో మాజీ సీఎం జగన్ కు గురువుగా ప్రచారంలో ఉన్న స్వామి స్వరూపానందేంద్రకు ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఇక, ఇప్పుడు టీటీడీ నోటీసుల పైన మఠం నిర్వాహకుల తదుపరి స్పందన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos