తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్లో ఈ రోజు గురువారం విచారిస్తున్నారు. విజయవాడ రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ తాను రాలేనని చెప్పడంతో సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి ఆయన ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పని చేసిన సమయంలో లడ్డూ తయారీ నెయ్యికి సంబంధించి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా, ఆయా సంస్థలతో ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది.. కల్తీ ఎక్కడ జరిగింది.. కల్తీ ఎలా చేశారు? అన్న కోణంలోనే విచారణ కొనసాగుతోంది. ఛైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారని సమాచారం. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీపైనా దర్యాప్తు బృందం దృష్టి కేంద్రీకరించింది.
తిరుమలలో 2019 - 24 సంవత్సరాల మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ పదార్థాలతో కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని ఇప్పటికే సిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో టీటీడీ కి సరఫరా చేసిన 68 లక్షల కిలోల నెయ్యి విలువ రూ. 250 కోట్లకు పైగా ఉంది. ఒక్క చుక్క కూడా పాలు సేకరించకుండా తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని కాంట్రాక్టర్లు సరఫరా చేసి, అక్రమ లాభాలు దండుకున్నారు. కాంట్రాక్టర్ల నుంచి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సన్నిహితుడైన చిన్న అప్పన్నకు రూ. 4.69 కోట్లు హవాలా ద్వారా ఇచ్చినట్లుగా గుర్తించారు. అప్పన్నను నవంబర్ 11న అరెస్టు చేసిన సిట్, అతని ఖాతాలో ఈ మొత్తం ఎలా వచ్చిందో, దాని మూలం ఏమిటో విచారించింది. సుబ్బారెడ్డికి ఈ కుంభకోణంలో పాత్ర ఉందా అనే అంశంపై ఇప్పుడు సిట్ ప్రధాన దృష్టి పెట్టింది. సుబ్బారెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని సిట్ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. సిట్ మాజీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) ఎ.వి. ధర్మారెడ్డిని కూడా విచారించింది. ఈ దర్యాప్తు ఫలితాలు త్వరలోనే ఏపీ హైకోర్టుకు సమర్పించనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos